2
కీర్తన 
1 యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది? 
ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు? 
2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు, 
వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు. 
3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం. 
మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు. 
4 కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు 
ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు. 
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు: 
“రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను. 
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” 
మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది. 
7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను. 
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను! 
మరియు నీవు నా కుమారుడివి. 
8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. 
భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు! 
9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు 
ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.” 
10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. 
పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి. 
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి. 
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి* 
మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు. 
యెహోవాయందు విశ్వసం ఉంచేవారు సంతోషిస్తారు. 
కానీ ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. 
