బెసలేలు, అహోలాయాబు 
31
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
2 “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు). 
3 బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను. 
4 నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు. 
5 బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు. 
6 అతనితో పని చేయటానికి అహూలియాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలియాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని వాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను. 
7 సన్నిధి గుడారం 
ఒడంబడిక పెట్టె 
పెట్టెను మూసే కరుణా పీఠము. 
8 బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక 
9 దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర 
ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని క్రింద పీట. 
10 యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ, 
అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ, 
11 అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం, 
పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం. 
ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.” 
సబ్బాతు 
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
13 “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది. 
14 “‘సబ్బాతు* రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి. 
15 పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి. 
16 ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక 
17 ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.’” 
18 అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు. 
